పసుపు గణపతిని ముందుగా ఎందుకు పూజిస్తాం? *సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకు ముందుగా “విఘ్నేశ్వరుని” పూజించాలి.
ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు “పసుపు” విఘేశ్వర పూజ చేయాలి.
దానికో కథ వుంది….
పూర్వం “త్రిపురాసురులు” అనే రాక్షసులు వుండే వారు. వారు బ్రహ్మచే అనేక వరాలు పొంది లోకాలన్నిటినీ బాధించసాగారు.
ఆకాశంలో “మూడు” నగరాలను నిర్మించుకొని దేవతలను, లోకాలనూ బాధించసాగారు. వీళ్ళ బాధలు భరించలేక దేవతలు, ప్రజలు…”శివుణ్ణి” ప్రార్థించారు.
అపుడు శివుడు రక్షిస్తానని అభయమిచ్చాడు.
“శివుడు” ఆలోచించి ఒక ఉపాయాన్ని చెప్పాడు. నందిని ఆ మూడు నగరాలను తన కొమ్ములతో యెత్తి పట్టుకోమన్నాడు.
అప్పుడు శివుడు… నంది కొమ్ముల పై యెత్తిన మూడు నగరాలతో సహా త్రిపురాసులను సంహరించాడు.
ఆ సమయంలో “నంది” “కొమ్ము” ఒకటి తెగి పడిపోయింది. అదే పసుపుకొమ్ము. దానితో నందికి చాలా దు:ఖం కలిగింది. “గణపతి” అప్పుడు ఆ కొమ్ము ఎక్కడ పడిందో వెదికి తెచ్చాడట.
కొమ్ము దొరికినందుకు నందికి చాలా ఆనందం కలిగింది.
అది చూచిన శివుడు “నందీ…నీ పసుపు కొమ్ము పడిన చోటున మొలిచిన….
“పసుపు కొమ్ముల” తోనే చూర్ణించగా వచ్చిన “పసుపు”తో “పసుపు గణపతి”ని చేసి…..
యే పూజకైనా మొదట పూజింప వలసినదే” అన్నాడట…
ఆ పసుపు కొమ్ములతో చూర్ణించిన “పసుపు”తోనే తయారుచేసిన పసుపు గణపతికి పూజ మొదలైందట!
అందుకే ఆయన “ఆది దేవుడు, “ప్రథమ పూజ్యుడు” అయ్యారు.
“ఓం గం గణపతయే నమః”
వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం మనస్సును పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం.
వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం! ఎందుకంటే…
ఆయన స్థిరంగా కూర్చుంటాడు. అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి “స్థిరో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు.” అని చదువుతారు. అందుకే “గజాననుని” ముందు, రోజూ కూర్చునే ప్రయత్నం చేయండి.
అందరూ రోజూ కాసేపు “గణపతి”పూజకి కేటాయించండి.
*మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ప్రతి విషయం త్వరగా అర్ధం అవడానికి ఇది బాగా ఉపకరిస్తుంది, కనుక గణపతి ఆరాధనను మీ నిత్యజీవితంలో భాగం చేసుకొండి.
*పిలిస్తే పలికే దైవం “గణనాధుడు.”
గం గణపతయే నమః
